గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు: ఈటల రాజేందర్

  • ఆర్టీసీ విలీనం బిల్లును మూడు రోజుల క్రితమే తమిళిసైకి పంపారన్న ఈటల
  • గవర్నర్ హైదరాబాద్ లో లేకపోయినా ప్రభుత్వం హడావుడి చేస్తోందని మండిపాటు
  • ఆర్టీసీ కార్మికులను బలవంతంగా రాజ్ భవన్ కు తీసుకొచ్చారని విమర్శ
తెలంగాణలో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ హైదరాబాద్ లో లేరని చెపుతున్నా కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. 

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని ఈటల చెప్పారు. గవర్నర్ కు ఈ బిల్లును మొన్ననే పంపారని... దాన్ని ఆమె చూడాలి, అధ్యయనం చేయాలి, సంతకం చేయాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా రాజ్ భవన్ వద్దకు తీసుకొచ్చారని మండిపడ్డారు. వచ్చే ప్రభుత్వంలోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయి పడ్డారని, ఆర్టీసీలో పని చేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు.

Etela Rajender
BJP
TSRTC
Tamilisai Soundararajan

More Telugu News